Thursday, April 2, 2015

చాటువులు

 చాటువులు

 ‘‘వాక్య రసాత్మకం కావ్యం’ అన్న లోకోక్తికి చాటు పద్యాలు చక్కని నిదర్శనాలు. ‘‘చాటు’’ అనే సంస్కృతపదం తెలుగులో చాటువుగా మారినది. ‘చాటు’ అంటే ప్రియమైనమాట అని అర్ధం.  కొందరు  కవులు ఆశువుగా చెప్పిన పద్యాలే చాటువులుగా మారాయని లోకోక్తి. నచ్చిన భావాన్ని నచ్చినట్టు ఏ నియమనిబంధనలు లేకుండా రాయగలిగేది చాటుపద్యం. సంక్షిప్తత, సూటిదనం, క్లుప్తత, స్పూర్తి  చాటు పద్యానికి ఉంటాయి. విజ్ఞాన సముపార్జనకు, వినోదానికి నిలయమైనవి  చాటువులు. వేటూరి ప్రభాకరశాస్త్రి గారు, దీపాల పిచ్చయ్య శాస్త్రిగారు చాటు వాఙ్మయంపై పరిశోధన చేసి ‘చాటు పద్య మణిమంజరి’, ‘చాటుపద్య రత్నావళి’ అన్న ప్రశస్తమైన గ్రంధాలని వెలువరించారు. రామాయణావతరణానికి దారితీసిన ‘మానిషాద’ శ్లోకము చాటువే. క్రౌంచపక్షి పతనాన్ని చూసిన వాల్మీకి గుండె ఆక్రోశించింది. ఆ శోకం శ్లోకంగా అవతరించిందని లోకోక్తి గలదు. చాటుపద్యాలను ఏ కవి రచించాడో నిర్ణయించటం చాలా కష్టం. కొన్నిసార్లు పద్యం ప్రసిద్ధికెక్కినా కవిపేరు మరుగున పడిపోవడం జరుగుతుంది.
ఒక సరదా చాటువు :
     వడపై నావడపై పకోడీపయి  హల్వాతుంటిపై బూంది యూం
     పొడిపై నుప్పిడి పై  రవిడ్డిలిపయిం బొండాపయిన్సేమీయీ
     సుడిపై బారు భవత్క్రుపారసము నిచ్చో గొంత రానిమ్మునే
     నుడుకుం గాఫిని ,యొక్క గ్రుక్క గొనెవే యో   కుంభదంభోధరా!!!!
భావం -  చిరుతిండ్ల మీద ఆసక్తి ఉన్న ఒక భోజన ప్రియునిపై ప్రయోగించిన పద్యమిది..
గారెల మీద, పెరుగు వడ మీద, పకోడీల  పైన , హల్వా ముక్కమీద, బూంది మీద, ఉప్మా మీద, రవ్వ ఇడ్లీ పైన, బోండా పైన, సేమియా పాయసం పైన నీ దయా రసం చక్కగా ప్రసరించి సుష్టుగా  వాటిని అరగించావు కదా, నన్ను ఎందుకు చిన్నచూపు చూస్తావు? అటువంటి దయారసాన్ని నా మీద కూడా కొంచెం ప్రసరించు.. వేడి వేడి కాఫీ ని నన్ను కూడా ఆరగించు, నీకు నమస్కరిస్తున్నాను, అని కాఫీ ఆ భోజనప్రియుడ్ని వేడుకొంటున్నది.
చదువు యొక్క గొప్పదనాన్ని మానవాళికి తెలియజెప్పే చాటువు :
     అక్షరంబు వలయు  కుక్షి జీవనులకు 
     నక్షరంబు జిహ్వాకిక్షురసము
     అక్షరంబు తన్ను రక్షించు గావున 
     నక్షరంబు లోకరక్షితంబు
మానవులకు చదువు ఎంతో అవసరమైనది. చదువు దాహంతో అలమటించే నాలుకకు చెరుకు రసం వంటిది. చదువుకుంటే  అది మనకు విచక్షణను, విజ్ఞానాన్ని, మంచి నడవడికను, వ్యక్తిత్వాన్ని అలవరుస్తుంది. కాబట్టి మనం చదువును రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది.
లోకప్రశస్తి చెందిన శ్రీనాధుని చాటువు :
    సిరిగల వానికి చెల్లును
    తరుణుల బదునారు వేలం దగ బెండ్లాడన్
    తిరిపెమున కిద్దరాండ్రా
    పరమేశా! గంగను విడుము పార్వతిచాలున్!’’
ఓ పరమేశా! డబ్బుగలవాడికి పదహారువేలమందిని చేసుకున్నా పోయేదేమీ ఉండదు. బిచ్చమెత్తుకుని బ్రతికే నీకు ఇద్దరు భార్యలు అవసరమా? ఆ పార్వతిని నీవుంచుకుని ఆ గంగాదేవిని మాకు విడిచిపెట్టు. అని మొరపెట్టుకున్నాడు. శ్రీనాధుడి ప్రాంతం నీటిఎద్దడికి ప్రసిద్ధి చెందినది. ఆ బాధని శ్రీనాధుడు వ్యంగ్యంగా ఇలా పద్యంలో వివరించాడు.

తిరుమలరాయలనే రాజు తెనాలి రామలింగని పిలిచి తనను పొగడమన్నాడట. ఆ పొగడ్త సహజంగా ఉండాలని, గోరంతదాన్ని కొండంత చేసి చెప్పకూడదన్న నియమం పెట్టాడట. అప్పుడు చెప్పిన పద్యం
 
అన్నాతి గూడ హరుడగు
అన్నాతి గూడకున్న నసురగురుడౌ
అన్నా! తిరుమలరాయా
కన్నొక్కటిలేదు కాని కౌరవపతివే!
 ఆ రాజు ఒంటికంటివాడు సహజంగానే వర్ణిస్తే భీభత్సంగా ఉంటుంది. మహా కవులకు సాధ్యం కానిదేముంది? శివునికి మూడు కన్నులు. తిరుమలరాయుడు భార్యతో కలిసి ఉన్నప్పుడు శివుడు. భార్య లేనప్పుడు శుక్రాచార్యుడు. ఆ కన్ను కూడా లేకపోతే నీవు ధృతరాష్ట్రుడవే అని ఎంత నేర్పుగా చమత్కరించినాడు.