Thursday, June 25, 2015

తొండమాన్ చక్రవర్తి కథ

          భవిష్యోత్తర పురాణము లోని కథ
          అన్నమాచార్యుల కృతులలో మనకు తొండమాన్ చక్రవర్తి పేరు వినిపిస్తుంది. కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ వేంకటనాథునికి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయిన పద్మావతీ దేవిని కన్యాదానమిచ్చిన మహానుభావుడు తొండమండలాధీశుడైన ఆకాశరాజు. తొండమానుడు ఆకాశరాజు సోదరుడు. అమిత శ్రీనివాస భక్తుడు. స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్య మందిర నిర్మాణము చేయించిన ధన్యజీవి. బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీవేంకటపతిని సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే. తొండమానుడు ఎంతటి భక్తుడంటే నిత్యము స్వామితో సంభాషణలు చేసేవాడు!
          ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి “ఆహా! ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా! శ్రీనివాసుని ప్రతి కైంకర్యుము నీచేతుల మీదిగా శ్రద్ధాభక్తులతో రంగ రంగ వైభవంగా చేయిస్తున్నావు. రాజా! నీవంటి విష్ణుభక్తుడు లేడయ్యా” అని అన్నది. అంతవరకూ స్వామిగురించి తప్ప ఏమీ ఆలోచించని తొండమానుడు “ఆకాశవాణి మాటలు నిజమే కదా! నావంటి భక్తుడు అరుదు” అని అనుకున్నాడు.
          అహంకారమెంత దారుణమైనది. చివరికి మహనీయుడైన తొండమానుని సైతం విడువలేదు! అహంకారమే సకల దురుతాలకు మూలము. అహంకారం గర్వం ఎంత కొంచమైనా అది ఉన్నవాడిని నిలువునా దహించివేస్తుంది. కానీ స్వామి సామాన్యుడా? ఒక్కసారి త్రికరణశుద్ధిగా శరణువేడిన పరమ శత్రువునైనా దరిజేరుస్తాడు. అలాంటిది సర్వసుగుణవంతుడు మహాభక్తుడు అయిన తొండమానుని పతనం జరగనిస్తాడా? వెంటనే తొండమానునికి గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు స్వామి.
          ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషించుచూ “నావంటి భక్తుడు ఈ ప్రపంచంలో లేడు. అసలు నేను తప్ప నీకు నిజభక్తులు ఎవరైనా ఉన్నారా దేవాదిదేవా?” అని ప్రశ్నించాడు. జగన్నాటకసూత్రధారి అప్పటికి చిరుమందహాసముతో సమాధానమిచ్చిఆ తొండమానునికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు.
          ఒకరోజు తొండమానుడు రోజూలానే ఉదయాన్నే స్వామి దర్శనము చేసుకొని నిశ్చల భక్తితో ఆ పరమపురుషుని ధ్యానించి కలిదోషనివారణములైన శ్రీపాదలను చూశాడు. శ్రీహరిపాదం చుట్టూ ఉన్న కోట్లాది సౌర్యమండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు.  కన్నులు మినుమిట్లు గొలిపే ఇంతటి సువర్ణకాంతులలోను రాజుకు వాడిపోయి మట్టి అంటుకొని ఉన్న కమలాలు తులసీదళాలు కనబడ్డాయి. “ఏమిటీ చిత్రమ్? వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి అయినా ఈ సుమాలిక్కడికి ఎలా వచ్చాయి? నేను స్వామిని స్వర్ణ కమాలతో తప్ప పూజించను కదా!” అని తర్కించుకొని నేరుగా స్వామినే ఈ ప్రశ్నవేశాడు. ఆ దయామయుడు చిరుమందహాసముతో ఇలా సమాధానమిచ్చాడు.         
          “నాయనా! ఇక్కడికి కొంత దూరములో ఉన్న పేదపల్లెలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు. అతని పేరు భీముడు. పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి ప్రేమ. అతనుండే ఇంటి మట్టి గోడలో ఒక గూడు చేసి అందులో నా కఱ్ఱబొమ్మ ఒకటి మలచి అందులో నన్ను భావించుకొంటూ పూజిస్తుంటాడు. భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ దీపించడం నా బాధ్యత కదా! ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది కాదుకదా! పాపం అతనికి మంత్రతంత్రాలు తపోయోగాలు ఏమీ తెలియవు. అయినా త్రికరణశుద్ధిగా నిరంతరం నన్ను ధ్యానిస్తూనే ఉంటాడు. తాను కుండలు చేస్తున్నా అన్నం తింటున్నా ఎప్పుడు నా ఊసే! నా ధ్యాసే!
          తన కులాచారం ధర్మం ఎల్లవేళలా పాటిస్తాడు. సూర్యోదయాత్పూర్వమే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసీదళాలు సమర్పిస్తాడు. అక్కడ అతడు వేసిన దళాలే నీకిక్కడ కనబడుతున్నాయి. అతనే కాదయ్యా వారి కుటుంబమంతా అంతే. నా మాట నా పాట తప్ప వారికేదీ రుచించదు. ఆ భీమ కులాలుని భక్తిపాశాలకు బంధీ అయిపోయానయ్యా!”
          విషయం తెలిసింది తొండమానునికి. భాష్పపూరితనయనాలతో “ప్రభూ!” అని ఆర్తితో పిలిచి స్వామిపాదాలపైపడి “జగన్నాథా! నా తప్పు క్షమించు. నావంటి భక్తుడు లేడని అహంకరించాను. నేను చూసిన ప్రపంచమెంత? నా అనుభవం ఎంత? నాపై దయతో నా బుద్ధిదోషాన్ని పోగొట్టి నిజమైన భక్తుని చేశావు తండ్రీ. ఇదుగో ఇప్పుడే వెళ్ళి భీముని దర్శనము చేసుకొని వస్తాను. నాకు సెలవు ఇవ్వు” అని చెప్పి బయలుదేరాడు రాజు.
“నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ |
మద్భక్తాః యత్రగాయంతి తత్ర తిష్ఠామి నారద!”
అన్న సూక్తి ప్రకారము భీముని దర్శనము తీర్థయాత్రగా భావించి రాజు నడుచుకుంటూ వెళ్ళాడు. పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణము చేయాలి కదా! భీముని ఇల్లు చేరాడు రాజు. భీముని ఇల్లు స్వామి భజనలతో మారుమ్రోగుతున్నది. భీముని పాదాలపైపడి “అయ్యా! శ్రీ వేంకటేశుని ద్వారా నీ మహాత్మ్యము తెలిసుకున్నాను. సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే నీ భక్తిని కొనియాడాడయ్య! నీ పాదధూళి తాకి పునీతుడని అవుదామని వచ్చాను” అని అన్నాడు తొండమానుడు. చక్రవర్తి ఏమిటి నా పాదలు తాకడం ఏమిటి అని వెనక్కు జరిగిపోయి చేతులు జోడించి “రాజా! అంత పని చేయద్దు. స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావుడవు నీవు” అని అన్నాడు.
          ఇంతలో గరుడారూహుడై స్వామి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమైనాడు. భీముని ఆనందానికి అంతులేదు. “ఓ దయామయ! నా పూరి గుడిసెకు వచ్చావా! నీ లీలలే లీలలయ్యా. మా తప్పులెన్నక దయావర్షం కురిపించే కాలమేఘానివి స్వామీ నీవు. నేను హనుమంతుని వలె వారధిదాటి నిన్ను మెప్పించలేను, శబరివలె భక్తిశ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను, జనకుని వలె సీతను ఇవ్వలేను, నారదుని వలె గంధర్వగానముతో నీ గుణగణాలను కీర్తించలేను, జటాయువు వలె నీకై నా ప్రాణాలు ఇవ్వలేను అయినా నిన్ను శరణువేడిన నన్ను కరుణించిన కరుణామూర్తివి నాయనా నీవు” అని స్తుతించాడు. భీముడిలా తన్మయత్వంతో ఆడిన మాటలను వేదమంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు స్వామి.
          మహాభక్తురాలైన భీముని భార్య తమాలినీ కూడా గద్గద స్వరంతో అమ్మని కీర్తించింది. ఆదిదేవుడు మహాలక్ష్మి స్వయంగా తన యింటికివచ్చారు. వారికి ఇవ్వదగినది ఏమీ లేదే అని బిడియపడింది. అది గమనించి శ్రీనివాసుడు “తమాలినీ! నీ చేతితో ఏది వండి ఇచ్చినా తింటానమ్మా” అని అన్నాడు. తమాలినీ సంతోషానికి పట్టపగ్గాలులేవు. తనకు పెద్దల వలన తెలిసినంతలో యథాశక్తిగా శుచితో తామర తూడ్లతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణులకు వడ్డించింది. తృప్తిగా ఆరగించారు అలమేలుమంగాశ్రీనివాసులు. తొండమానుడు చూస్తుండగానే దివ్యశరీరధారులై వైకుంఠధామానికి చేరారు భీమకులాల దంపతులు.
          ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమాను “ప్రభూ! నా సంగతేమిటి” అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు జగన్నాథుడు “రాజా! తరువాత జన్మలో నీవు విరాగివై నా ఏకాంతభక్తుడవు అవుతావు. అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది” అని చెప్పి తొండమానుని ఊరడించాడు. ఇలా తొండమానునికి భీమునికి ముక్తిని ప్రసాదించాడు శ్రీవేంకటేశుడు.
          అహంకారం ఎంతవారికైనా ఎంతకొంచమైనా తగదు. మహనీయుడైన తొండమానునికే అహంకారము వలన భంగపాటు తప్పలేదు. ఇక సామాన్యులమైన మనసంగతి ఏమిటి? కాబట్టి మనమెల్లప్పుడు వినయవిధేయతలతో ఉండాలి.  కులధర్మం కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కల్మష భక్తితో కొలిచే వారిని కరుణిస్తాడు భగవంతుడు అని నిరూపించాడు భీముడు. కులం కన్నా గుణం ప్రధానమైనది.


Thursday, April 2, 2015

చాటువులు

 చాటువులు

 ‘‘వాక్య రసాత్మకం కావ్యం’ అన్న లోకోక్తికి చాటు పద్యాలు చక్కని నిదర్శనాలు. ‘‘చాటు’’ అనే సంస్కృతపదం తెలుగులో చాటువుగా మారినది. ‘చాటు’ అంటే ప్రియమైనమాట అని అర్ధం.  కొందరు  కవులు ఆశువుగా చెప్పిన పద్యాలే చాటువులుగా మారాయని లోకోక్తి. నచ్చిన భావాన్ని నచ్చినట్టు ఏ నియమనిబంధనలు లేకుండా రాయగలిగేది చాటుపద్యం. సంక్షిప్తత, సూటిదనం, క్లుప్తత, స్పూర్తి  చాటు పద్యానికి ఉంటాయి. విజ్ఞాన సముపార్జనకు, వినోదానికి నిలయమైనవి  చాటువులు. వేటూరి ప్రభాకరశాస్త్రి గారు, దీపాల పిచ్చయ్య శాస్త్రిగారు చాటు వాఙ్మయంపై పరిశోధన చేసి ‘చాటు పద్య మణిమంజరి’, ‘చాటుపద్య రత్నావళి’ అన్న ప్రశస్తమైన గ్రంధాలని వెలువరించారు. రామాయణావతరణానికి దారితీసిన ‘మానిషాద’ శ్లోకము చాటువే. క్రౌంచపక్షి పతనాన్ని చూసిన వాల్మీకి గుండె ఆక్రోశించింది. ఆ శోకం శ్లోకంగా అవతరించిందని లోకోక్తి గలదు. చాటుపద్యాలను ఏ కవి రచించాడో నిర్ణయించటం చాలా కష్టం. కొన్నిసార్లు పద్యం ప్రసిద్ధికెక్కినా కవిపేరు మరుగున పడిపోవడం జరుగుతుంది.
ఒక సరదా చాటువు :
     వడపై నావడపై పకోడీపయి  హల్వాతుంటిపై బూంది యూం
     పొడిపై నుప్పిడి పై  రవిడ్డిలిపయిం బొండాపయిన్సేమీయీ
     సుడిపై బారు భవత్క్రుపారసము నిచ్చో గొంత రానిమ్మునే
     నుడుకుం గాఫిని ,యొక్క గ్రుక్క గొనెవే యో   కుంభదంభోధరా!!!!
భావం -  చిరుతిండ్ల మీద ఆసక్తి ఉన్న ఒక భోజన ప్రియునిపై ప్రయోగించిన పద్యమిది..
గారెల మీద, పెరుగు వడ మీద, పకోడీల  పైన , హల్వా ముక్కమీద, బూంది మీద, ఉప్మా మీద, రవ్వ ఇడ్లీ పైన, బోండా పైన, సేమియా పాయసం పైన నీ దయా రసం చక్కగా ప్రసరించి సుష్టుగా  వాటిని అరగించావు కదా, నన్ను ఎందుకు చిన్నచూపు చూస్తావు? అటువంటి దయారసాన్ని నా మీద కూడా కొంచెం ప్రసరించు.. వేడి వేడి కాఫీ ని నన్ను కూడా ఆరగించు, నీకు నమస్కరిస్తున్నాను, అని కాఫీ ఆ భోజనప్రియుడ్ని వేడుకొంటున్నది.
చదువు యొక్క గొప్పదనాన్ని మానవాళికి తెలియజెప్పే చాటువు :
     అక్షరంబు వలయు  కుక్షి జీవనులకు 
     నక్షరంబు జిహ్వాకిక్షురసము
     అక్షరంబు తన్ను రక్షించు గావున 
     నక్షరంబు లోకరక్షితంబు
మానవులకు చదువు ఎంతో అవసరమైనది. చదువు దాహంతో అలమటించే నాలుకకు చెరుకు రసం వంటిది. చదువుకుంటే  అది మనకు విచక్షణను, విజ్ఞానాన్ని, మంచి నడవడికను, వ్యక్తిత్వాన్ని అలవరుస్తుంది. కాబట్టి మనం చదువును రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది.
లోకప్రశస్తి చెందిన శ్రీనాధుని చాటువు :
    సిరిగల వానికి చెల్లును
    తరుణుల బదునారు వేలం దగ బెండ్లాడన్
    తిరిపెమున కిద్దరాండ్రా
    పరమేశా! గంగను విడుము పార్వతిచాలున్!’’
ఓ పరమేశా! డబ్బుగలవాడికి పదహారువేలమందిని చేసుకున్నా పోయేదేమీ ఉండదు. బిచ్చమెత్తుకుని బ్రతికే నీకు ఇద్దరు భార్యలు అవసరమా? ఆ పార్వతిని నీవుంచుకుని ఆ గంగాదేవిని మాకు విడిచిపెట్టు. అని మొరపెట్టుకున్నాడు. శ్రీనాధుడి ప్రాంతం నీటిఎద్దడికి ప్రసిద్ధి చెందినది. ఆ బాధని శ్రీనాధుడు వ్యంగ్యంగా ఇలా పద్యంలో వివరించాడు.

తిరుమలరాయలనే రాజు తెనాలి రామలింగని పిలిచి తనను పొగడమన్నాడట. ఆ పొగడ్త సహజంగా ఉండాలని, గోరంతదాన్ని కొండంత చేసి చెప్పకూడదన్న నియమం పెట్టాడట. అప్పుడు చెప్పిన పద్యం
 
అన్నాతి గూడ హరుడగు
అన్నాతి గూడకున్న నసురగురుడౌ
అన్నా! తిరుమలరాయా
కన్నొక్కటిలేదు కాని కౌరవపతివే!
 ఆ రాజు ఒంటికంటివాడు సహజంగానే వర్ణిస్తే భీభత్సంగా ఉంటుంది. మహా కవులకు సాధ్యం కానిదేముంది? శివునికి మూడు కన్నులు. తిరుమలరాయుడు భార్యతో కలిసి ఉన్నప్పుడు శివుడు. భార్య లేనప్పుడు శుక్రాచార్యుడు. ఆ కన్ను కూడా లేకపోతే నీవు ధృతరాష్ట్రుడవే అని ఎంత నేర్పుగా చమత్కరించినాడు. 

Sunday, March 22, 2015

పుష్ప విలాపం

పుష్పవిలాపం

కొందరు కవులు రాసిన వర్ణనలను చదివినప్పుడు ఆడవారికి పూలకు విడదీయలేని అవినాభావసంబంధమేదో ఉందనిపించేది. పుష్పవిలాపం గురించి విననంత వరకూ.. పూలను మానవుల అవసరాల కోసం, సంతోషం కోసం, పూజాధికాల కోసం దేవుడు సృష్ఠించాడేమో అనుకునేదాన్ని. కానీ ఈ కావ్యం చదివిన తరువాత పూలకు మనసుంటుందా? అవి ఇంతలా బాధపడ్తాయా అనిపించింది. మన ఆహ్లాదం కోసం వాటికి ఇబ్బంది కల్గించకూడదేమో అనిపించింది.  'నాకు పూలు నచ్చవు' అని చెప్పే ఆడవారిని మనం అరుదుగా చూస్తుంటాం. ఇది చదివిన తరువాత ఆడవారికి పూలపట్ల మనసు పోదేమోననిపించింది..! జంధ్యాల గారి కావ్యానికి ఘంటసాల గారి గానం కలగలిసి మనసును కరిగించేస్తుంది ఈ కావ్యం.

పుష్ప విలాపం పద్యాలు - కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి

చేతులారంగ నిన్ను పూజించుకొరకు
కోడి కూయంగనే మేలుకొంటి నేను;
గంగలో మున్గి ధౌత వల్కలము గట్టి
పూలు కొనితేర నరిగితి పుష్పవనికి


నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని పొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభూ ఉదయశ్రీ అరుణారుణ కాంతులతో ఉద్యానవనం కలకలలాడుతోంది పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి అప్పుడు...

నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
ప్రాణము తీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
మానసమం దెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై..!

అంతలో ఒక సన్నజాజికన్నె సన్నని గొంతుకతో నన్ను చూసి యిలా అంది ప్రభూ...

తల్లి యొడిలోన తలిరాకు తల్ప మందు
ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి
అమ్ముకొందువె మోక్ష విత్తమ్ము కొరకు!
హౄదయమే లేని నీ పూజ లెందుకోయి?

జడమతుల మేము; జ్ఞానవంతుడవు నీవు;
బుధ్ధి యున్నది; భావ సమౄద్ధి గలదు;
బండబారె నటోయి నీ గుండెకాయ!
శివునకై పూయదే నాల్గు చిన్ని పూలు?

ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తు ము; తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై.

ఎందుకయ్యా మా స్వేచ్చ జీవనానికి అడ్డు వస్తావు..? మేము నీకేం అపకారము చేసాము???

గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భృం
గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు; మిమ్ము బోంట్ల నే
త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధ బుద్ధితో
తాళుము త్రుంప బోవకుము; తల్లికి బిడ్డకు వేరు సేతువే!

యింతలో ఒక గులాబి బాల కోపంతో మొగమంతా ఎర్రబడి యిలా అంది ప్రభూ..!

ఆత్మ సుఖమ్ము కోసమయి అన్యుల గొంతులు కోసి తెచ్చు పు
ణ్యాత్ముడ! నీకు మోక్ష మెటు లబ్బును? నెత్తురు చేతి పూజ వి
శ్వాత్ముడు స్వీకరించునె? చరాచర_వర్తి ప్రభుండు మా పవి
త్రాత్మల నందుకోడె! నడమంత్రపు నీ తగులాట మేటికిన్?

ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచు_కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేని వారు మీ యాడువారు

గుండె తడి లేక నూనెలో వండి పిండి
అత్తరులు చేసి మా పేద నెత్తురులను
కంపు దేహాలపై గుమాయింపు కొరకు
పులుముకొందురు హంత! మీ కొలము వారు.

అక్కట! హాయి మేము మహిషాసురు లెందరొ నాల్గు ప్రక్కలన్
ప్రక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పాడు కాళ్ళతో
ద్రొక్కుచు దొర్లి - దొర్లి - మరు రోజుదయాననె వాడి వత్తలై
రెక్కలు జారిపోఁ పరిహరింతురు మమ్ముల పెంటదిబ్బ పై.

మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా
యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ
మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా !

వోయీ మానవుడా..........!!

బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
అందమును హత్య చేసెడి హంతకుండ!
మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.

పూజ లేకున్న బాబు నీ పున్నె మాయె!
కోయ బోకుము మా పేద కుత్తుకలను
అకట! చేసేత మమ్ముల హత్య చేసి
బాపుకొన బోవు ఆ మహా భాగ్య మేమి?

ఇట్లు పుష్పాలు నన్ను చీవాట్లు పెట్టి
నట్లుగాన్ - పూలు కోయ చేయాడలేదు;
ఏమి తోచక దేవర కెరుక సేయ
వట్టి చేతులతో ఇటు వచ్చినాను..

సారాంశం
పాపయ్య శాస్త్రి గారు సృష్టించిన మధుర మనోజ్ఞ కరుణ రస భావ కావ్యమిది. భక్తుడు దైవ పూజ కోసం పూలు కోయబోయే సమయంలో ఆ పూలు 'మా ప్రాణాలు తీయబోకు..' అని బావురుమని ఏడ్చాయి.
''తల్లి ఒడిలో ఆడుకునే మమ్మల్ని కోసి, బుట్టల్లో అదిమి.. చిదిమి.. అమ్మేస్తున్నారు. మోక్షమనే విత్తం కోసమే కదా మీ ఆరాటం'' అని ఈసడించాయి. ''అమాయకులమైన మేము తీగతల్లిని అంటుకుని నాలుగు ఘడియలు ఆనందంగా గడిపి.. ఆ తల్లి చల్లటి పాదాలపైనే రాలి, కన్నుమూస్తాం. జీవించి ఉన్నంత కాలం మేం నిస్వార్థంతో సుగంధమిచ్చి గాలిని గౌరవిస్తాం. తుమ్మెదలకు మకరందం అందించి విందు చేస్తాం. మీలాంటి మనుషులకు కనువిందు చేస్తాం. అలాంటి స్వతంత్రులైన మమ్మల్ని మా తల్లి నుంచి వేరు చేయొద్దు''. అని ప్రాధేయపడ్డాయి.



''మీ సంతోషం, తృప్తి కోసం ఊలు దారాలతో మా గొంతులకు ఉరి బిగించి.. గుండెల్లో సూదులు గుచ్చి.. మాలలు కట్టి ఆడవాళ్లు.. పడకల మీద చల్లుకుని మగవాళ్లు.. మమ్మల్ని అనుభవిస్తారు. మా గొంతులు కోసి దైవ పూజ చేస్తారు''.
''దైవం మాలో లేడా..! విశ్వాత్ముడైన పరమాత్మ మీ నెత్తుటి పూజను స్వీకరిస్తాడా..? చివరికి మమ్మల్ని చీపుళ్లతో బయటకు ఊడ్చేస్తారు. కొందరైతే నూనెలో వండి అత్తర్లుగా చేసి.. తమ కంపు దేహాలపై పులుముకుంటారు. మీ మానవులంతా హంతకులు.. మీకు నీతి లేదు... బుద్ధుడు పుట్టిన పవిత్ర భూమిలో పుట్టిన మీలో సహజంగా ఉండే ప్రేమ ఎందుకు చచ్చిపోయింది...? పూల హంతకులుగా మారి మానవతకు మచ్చతేవద్దు'' అని పూలు భక్తుడిని వేడుకుంటాయి. ఆ ప్రార్థన, చీవాట్లు విన్న భక్తుడు ఏం చేయాలో తోచక వట్టి చేతులతో వెనుదిరిగి వెళతాడు.

ఈ కావ్యం ఘంటసాల గారి గళమునందు..!!